Saturday, April 28, 2012

మన మహనీయులు

మన దేశ సంస్కృతిని దశ దిశల వ్యాపింప చేసిన వారు ఎందరో మహానుభావులు  ...అందరికి వందనములు 
అటువంటి మహనీయుల గురించి వివరించడం సాహసం అయినప్పటికీ ఈ ప్రయత్నాన్ని మన్నిస్తారని ఆశిస్తూ.....


మన మహనీయులు -1

వాల్మీకి మహర్షి :

శ్రీ రామాయణం అనే అమృత భాండాన్ని మనకు అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి...
వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు.
వాల్మీకి మహర్షి వృత్తాంతం స్కాంద పురాణంలో చెప్పబడుతుంది. వేదవ్యాసుడు సనత్సుజాతుడిని వాల్మీకి ముని వృత్తాంతం గురించి అడుగుతాడు. వాల్మీకి ముని పూర్వపు నామధేయం రత్నాకరుడు . రత్నాకరుని తల్లిదండ్రులు కౌశికి, సుమతి. చిన్నతనంలో రత్నాకరుడు  వేదాభ్యాసం సరిగా చేయలేదు. తల్లిదండ్రులు పెద్దవారు అయ్యాక ఆ రాజ్యంలో క్షామము వచ్చింది. అందువలనరత్నాకరుడు తిండి కోసం , దైనందిక జీవితం కోసం దారి దొంగగా మారిపోతాడు. ఒకరోజు దారి దోపిడి చేస్తుండగా సప్తఋషులు ఆ మార్గంలో వస్తారు. అప్పుడు అ సప్త మహర్షులలో ఒకరైన అత్రి మహర్షి రత్నాకరుని ప్రశ్నిస్తాడు. తన కుటుంబీకులు తాను చేస్తున్న పాపాన్ని భరిస్తారో లేదో కనుగొని రమ్మంటాడు. అప్పుడు రత్నాకరుడు  ఇంటికి చేరుకొని తన కుటుంబ సభ్యులను తాను చేసే కర్మలలో భాగం పంచుకొంటారా అని అడుగగా వారు పంచుకోమని చెబుతారు. విషయాన్ని వెళ్లి సప్తఋషుల కు చెప్పగా అపుడు అత్రి మహర్షి మోక్ష ప్రాప్తికి ధ్యానం చెయ్యమని రామ నామాన్ని తిప్పి "మరా" అని బోధించి మరా నామాన్ని జపించమని చెప్పి వెళ్లిపోతారు. చాలా కాలం తరువాత అత్రి మహర్షి ఆ మార్గంలో పయనిస్తుండగా అక్కడ ఒక చీమల పుట్ట కనిపిస్తుంది. అది చూసి అక్కడ రత్నాకరుడు  ఉన్నాడని గ్రహించి వానికి ఉపదేశం చేస్తాడు , 'వల్మీకం' అంటే పుట్ట నుండి వచ్చిన వాడు కాబటి వాల్మీకి అయ్యాడు.



ఒక నాడు నారద మహర్షి తో  వాల్మీకి లోకంలో  అన్ని గుణాలు కలిగిన వాడు ఎవరైనా వున్నారా అని అని అడుగగా అప్పుడు నారద మహర్షి ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు. 


సంక్షిప్త రామాయణం
http://www.freewebs.com/bhakthitelugu/samkshipta_ramayanam.pdf

చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్న  సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది...........
************************************
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||
************************************
ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు.

ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు "ఓ మహర్షి ! నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ." అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం చూడండి......

"నిషాద" అంటె బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. "మా" అంటె లక్ష్మి దేవి. "మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః", అంటె లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. " యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్", కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జెరుగుగాక, అని ఆ శ్లోక అర్ధం మారింది.

బ్రహ్మగారు అన్నారు, "నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను " నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు.

అలా మనకు వచ్చినదే  శ్రీ రామాయణం.......

స్వస్తి .........
  

No comments:

Post a Comment